అద్భుతంగా ఉందన్న మంత్రి వంగలపూడి అనిత
సింగపూర్ : ఏపీకి చెందిన మంత్రులు వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్య ప్రసాద్, సత్య కుమార్ యాదవ్, అచ్చెన్నాయుడుల తో కూడిన బృందం సింగపూర్ పర్యటన ముగిసింది. సింగపూర్ పర్యటనలో భాగంగా ఏడవ రోజు న్యూ ఫినిక్స్ పార్క్లోని పోలీస్ ఆపరేషన్స్ కమాండ్ సెంటర్ ను సందర్శించారు. అత్యాధునిక AI సాంకేతికత, డేటా అనలిటిక్స్, రియల్ టైమ్ మానిటరింగ్ ద్వారా నేరాలను అరికట్టడం, అత్యవసర పరిస్థితుల్లో వివిధ విభాగాలను సమన్వయం చేయడం, భవిష్యత్తు సవాళ్లను ముందే అంచనా వేసి ఎదుర్కోవడానికి సింగపూర్ హోమ్ మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న అద్భుతమైన వ్యూహాలను నిశితంగా పరిశీలించినట్లు తెలిపారు మంత్రి అనిత.
మంత్రులతో కలిసి ఈ పర్యటనలో తాము పొందిన అనుభవాలు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత పటిష్టం చేయడానికి, ప్రజలకు అత్యుత్తమ భద్రతను , సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడానికి ఎంతగానో దోహద పడతాయని విశ్వసిస్తున్నట్లు వెల్లడించారు మంత్రి అనిత వంగలపూడి.





