సంచలన వ్యాఖ్యలు చేసిన టీవీకే విజయ్
చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. ఈనెల 4వ తేదీన ఎవరు గెలుస్తారో తేలి పోనుంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అన్నీ గంపగుత్తగా డీఎంకే సారథి, సీఎం ఎంకే స్టాలిన్ మరోసారి జెండా ఎగుర వేస్తారంటూ ఊదర గొడుతున్నాయి. కానీ అందుకు భిన్నంగా మరొకొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం తమిళనాడు రాజకీయాలలో ఈసారి కింగ్ పిన్ గా టీవీకే పార్టీ చీఫ్, అగ్ర నటుడు దళపతి విజయ్ మారబోతున్నారని పేర్కొంటున్నాయి. ఈ తరుణంలో ఎన్నికలు ముగియడంతో మరోసారి సంచలనంగా మారారు. ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 234 నియోజకవర్గాలలో టీవీకే తరపున బరిలో ఉన్న అభ్యర్థులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు టీవీకే విజయ్.
ఈ సందర్బంగా పార్టీ అభ్యర్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఎగ్జిట్ పోల్స్ గురించి పట్టించు కోవద్దని సూచించారు. గ్రౌండ్ రియాల్టీ పరంగా చూస్తే టీవీకే పార్టీకి యువతీ యువకులు, మహిళలు పెద్ద ఎత్తున స్పందించారని చెప్పారు. ఈ సందర్బంగా నటుడు విజయ్తో జరిగిన భేటీ గురించి డాక్టర్ రాధాకృష్ణన్ నగర్ నియోజకవర్గ టీవీకే అభ్యర్థి ఎన్. మేరీ విల్సన్ ఇలా అన్నారు. ఎన్నికల ప్రచారం, పోలింగ్ సమయంలో తమకు ఎదురైన అనుభవాలను చర్చించడానికి ఇదొక మంచి అవకాశం అన్నారు. ఆయనను మళ్ళీ చూడటం మాకూ చాలా ఆనందాన్నిచ్చింది అని చెప్పారు.






