సకాలంలో విద్యార్థులకు వస్తువులు అందాలి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులకు సంబంధించి సరఫరా చేసే వస్తువుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడ కూడదని అన్నారు. విద్యా శాఖపై సమీక్ష చేపట్టారు. సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో విద్యార్థులకు అందించే వస్తువులు, సంక్షేమ పథకాల పై విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సందర్బంగా కీలక సూచనలు చేశారు. సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలకు సరఫరా చేసే దుస్తులు, పుస్తకాలు, నోట్ బుక్స్, ఇతర వస్తువులను సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్ మెంట్ ద్వారా విద్యార్థులకు అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
సంక్షేమ పథకాలు సరఫరాదారుల కోసం కాదు, లబ్ధిదారుల కోసం అన్న విషయం గుర్తుంచు కోవాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన వస్తువులను అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా మండల స్థాయిలో ఒక నోడల్ అధికారిని నియమించాలని ఆదేశించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. విద్యార్థులకు అందించే వస్తువుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని , ఆలస్యం జరిగితే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.






