ప్రశంసించిన మంత్రి ఎస్. సవిత
అమరావతి :టెన్త్ ఫలితాల్లో ఎంజేపీ గురుకులు, బీసీ హాస్టళ్ల విద్యార్థులు సత్తా చాటడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తంచేశారు. ఎంజేపీలో 96.02 శాతంతో, బీసీ హాస్టళ్లలో 85.99 శాతంతో ఉత్తీర్ణత సాధించినందుకు విద్యార్థులకు, ఉపాధ్యాయ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. మంత్రి లోకేశ్ రూపొందించిన వంద రోజుల ప్రణాళికలు సత్ఫలితాలు ఇచ్చాయన్నారు. బీసీ బిడ్డలు అత్యున్నత స్థానాల్లో నిలవాలన్నది సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సంకల్పమన్నారు. విద్యతోనే అత్యున్నత స్థానాలు సాధ్యమని నమ్మి, ఎంజేపీ, బీసీ హాస్టళ్ల అభివృద్ధికి రెండేళ్లలో పెద్దఎత్తున నిధులు కేటాయించారన్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో బీసీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని కొనియాడారు.
సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేశ్ కు బీసీ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల తరఫున మంత్రి సవిత ధన్యవాదాలు తెలియజేశారు. టెన్త్ పరీక్షల్లో ఎంజేపీ స్కూళ్ల విద్యార్థులు 96.02 శాతంతో ఉత్తీర్ణత సాధించడంపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి సవితను ఆ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, ఎంజేపీ స్కూళ్ల కార్యదర్శి మాధవీలత మర్యాద పూర్వకంగా కలిశారు. గతేడాది కంటే అత్యధిక ఫలితాలు సాధించినందుకు కార్యదర్శి సత్యనారాయణకు, మాధవీలతకు స్వీట్లు అందజేసి, మంత్రి అభినందించారు.





