హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నల్లగొండ జిల్లా : తన వద్ద చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గా పని చేస్తూ అకస్మాత్తుగా గుండె పోటుకు గురై మృతి చెందిన మదుసూదన్ కుటుంబాన్ని ఆదుకుంటానని ప్రకటించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. తన హఠాన్మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. మధు నాకు కేవలం అధికారి మాత్రమే కాదు, నా ప్రతి అడుగులో వెన్నంటి ఉండే కుటుంబ సభ్యుడు అని గుర్తు చేసుకున్నారు. వృత్తి పట్ల ఆయనకున్న అంకితభావం, నిబద్ధత మరువలేనివి అని కొనియాడారు. ఆయన మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు అని అన్నారు మల్లు భట్టి విక్రమార్క.
ఇవాళ మిర్యాలగూడలోని మధుసూదన్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. శోకసంద్రంలో ఉన్న ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మధు భార్య జ్యోతి బదిలీ విషయంలోనూ, బీటెక్ పూర్తి చేసిన వారి కుమారుడు సూరజ్ భవిష్యత్తుకు సంబంధించి ప్రభుత్వం తరపున, వ్యక్తిగతంగానూ పూర్తి బాధ్యత తీసుకుంటానని కుటుంబీకుల మద్య ప్రకటించారు.
పాత్రికేయ విలువలకు మారుపేరుగా నిలిచిన మధుసూదన్ జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచి పోతాయన్నారు. వారి కుటుంబానికి ఎటువంటి అవసరం వచ్చినా కంటికి రెప్పలా కాపాడుకుంటాం అన్నారు. మధు ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.






