90 శాతం మేర సబ్సిడీ కింద పరికరాలు
అమరావతి : ఏపీ కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చేనేత కార్మికులకు చేయూత ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తోంది. పెన్షన్లు, నూలుపై సబ్సిడీ, త్రిఫ్ట్ ఫండ్ నిధులు, ముద్ర రుణాలు, 90 శాతం సబ్సిడీ ఆధునిక పరికరాలు అందజేత వంటి కార్యక్రమాలను సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు మంత్రి ఎస్.సవిత. ముఖ్యంగా చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ కల్పించేలా కూటమి ప్రభుత్వం పలు ఒప్పందాలు చేసుకుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మెగా టెక్స్ టైల్స్ పార్కులు, క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నాం అని వెల్లడించారు.
గత నెల ఒకటో తేదీ నుంచి అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ పథకంతో నేతన్న కుటుంబాలకు మరింత లబ్ధి కలుగుతోందని చెప్పారు ఎస్. సవిత. మగ్గం నేతన్నలకు ఏడాదికి రూ.8,640లు, మరమగ్గం నేతన్నలకు రూ.21,600 లబ్ధి కలుగుతోందని అన్నారు. చేనేతలకు 365 రోజుల పాటు పని కల్పించడమే సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు. ఆ లక్ష్యం దిశగా వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నాం అని తెలిపారు ఎస్. సవిత.ఉచిత విద్యుత్ తో నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పించిన సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేశ్ కు చేనేతల తరఫున ధన్యవాదాలు తెలియ చేశారు.






