రాజమన్నార్ అలంకారంలో స్వామి అనుగ్రహం
తిరుపతి : తిరుపతి జిల్లా లోని నాగలాపురం శ్రీ వేద నారాయణ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో రోజైన ఆదివారం రాత్రి ముత్యపు పందిరి వాహనంపై రాజమన్నార్ అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తించగా, మంగళ వాయిద్యాల నడుమ వాహనసేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు.
స్వామివారికి అలంకరించిన ముత్యాల హారాలు శాంతి, ప్రశాంతతను ప్రసాదిస్తూ, భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించాయి. ఈ వాహనసేవలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాసులు, చెంగల్రాయులు, ఆలయ అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా వేద నారాయణ స్వామి భక్తులకు అనుగ్రహం ఇవ్వడంతో ఆనంద పారవశంలో మునిగి పోయారు. ఇదిలా ఉండగా ఉత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.







