8 వికెట్ల తేడాతో కేకేఆర్ చేతిలో ఘోర ఓటమి
ఢిల్లీ : ఐపీఎల్ మెగా టోర్నీలో భాగంగా స్వంత గడ్డపై మరో పరాజయాన్ని చవి చూసింది అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్. మొన్న చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓటమి పాలు కాగా తాజాగా కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో సైతం సేమ్ వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 147 రన్స్ మాత్రమే చేసింది ఢిల్లీ. అనంతరం మైదానంలోకి దిగిన కేకేఆర్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఈ విజయంతో ఆ జట్టుకు ఇది నాలుగో విజయం కాగా ఢిల్లీ క్యాపిటల్స్ కు 7వ పరాజయం కావడం విశేషం.
ఇదిలా ఉండగా ఓపెనింగ్ కు వచ్చిన ఫిన్ అలెన్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తను కేవలం 47 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. ఇందులో 5 ఫోర్లు 10 భారీ సిక్సర్లు ఉన్నాయి. కాగా ఈ మెగా టోర్నమెంట్ లో ఫిన్ అలెన్ కు ఇది తొలి సెంచరీ కావడం విశేషం. మ్యాచ్ అనంతరం కెప్టెన్ అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. మా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ పరమ చెత్తగా ఉందన్నాడు. దీని కారణంగా తాము వరుసగా ఓడి పోతున్నామని వాపోయాడు. ఏదీ సవ్యంగా సాగడం లేదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదన్నాడు. మాకు కొంత విరామం కావాల్సిన అవసరం ఉందన్నారు.






