స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్ బాబు
న్యూఢిల్లీ : ఏపీలో కూటమి సర్కార్ ఇంధన పరివర్తనపై ఎక్కువగా ఫోకస్ పెట్టిందన్నారు మంత్రి నారా లోకేష్. న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తాము కొత్త పారిశ్రామిక కారిడార్లను నిర్మిస్తున్నాం అన్నారు, ఎలక్ట్రానిక్స్ తయారీ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాం అని తెలిపారు. వివిధ రకాల రెన్యువబుల్ ఎనర్జీ సాధనకు ఆ రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతున్నాం అని ప్రకటించారు. విశాఖపట్నాన్ని ఏఐ, డేటా సెంటర్ హబ్ గా అభివృద్ధి చేస్తున్నాం అని తెలిపారు. 6 గిగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్లు పోర్టు సిటీలో రాబోతున్నాయని వెల్లడించారు నారా లోకేష్.. భవిష్యత్ తరం పరిశ్రమలకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్ బోన్ను నిర్మిస్తున్నాం అన్నారు.
ఇందులోకి భారీ పరిమాణంలో విశ్వసనీయ విద్యుత్ అవసరం ఉంటుందన్నారు నారా లోకేష్. ఇందుకు సీజనల్ సాంప్రదాయ విద్యుత్ కాకుండా నాణ్యత కలిగిన కాలుష్య రహిత, తక్కువ ఖర్చుతో కూడిన రౌండ్-ది-క్లాక్ (24/7) ఇంధనం అవసరం ఉంటుందన్నారు. అందువల్లే ఎనర్జీ ప్లానింగ్ అన్నది ఆర్థిక ప్రణాళికలో కీలకాంశంగా మారిందన్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ ఇంధన పరివర్తనపై దీర్ఘకాలిక, సమగ్ర దృక్పథాన్ని అవలంబిస్తోందని తెలిపారు. మా ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీలో రెన్యూవబుల్స్, స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్ మిషన్ ఇన్ఫ్రా, మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్, గ్రిడ్ ఆధునీకరణ రంగాల్లో సుమారుగా ₹10 లక్షల కోట్లు పెట్టుబడులను మేం లక్ష్యంగా పెట్టుకున్నాం అని తెలిపారు.






