మే 23 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి : శ్రీ గోవింద రాజ స్వామి వారి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 23 నుండి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇక క్షేత్రనికి ఘనమైన చరిత్ర ఉంది. ఈ మహాక్షేత్రంలో శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి స్థానక రూపంలో, శ్రీ పార్థసారథి స్వామి వారు ఆసీన రూపంలో, శ్రీ గోవిందరాజ స్వామి వారు శయన రూపంలో దర్శనమిస్తారు. ఒకే ప్రాంగణంలో నిల్చున్న, కూర్చున్న, శయనించిన విష్ణుమూర్తుల సన్నిధులు దర్శనమివ్వడం ప్రపంచంలోనే అరుదైన విశేషంగా భావించ బడుతోంది.
ఆలయ ప్రాంగణంలో వెలసిన శ్రీ ఆండాళ్ అమ్మ వారు, శ్రీ పుండరీకవల్లి అమ్మ వారు, సుదర్శన చక్రత్తాళ్వార్ సన్నిధి, భగవత్ రామానాజులు, తిరుమలనంబి, అనంతాళ్వారుల సన్నిధులు భక్తులకు మరింత ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తున్నాయి. వైష్ణవ సంప్రదాయానికి ప్రతీకలుగా ఈ దివ్య సన్నిధులు తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ధ్వజారోహణ మండపం, మహామండపం, అర్ధమంటపం, అంతరాలయ మండపం, గర్భాలయ మండపం, బుగ్గ మండపాలు, రాములవారి మండపం, వాహన మండపం, ఉత్సవ మండపాలు అద్భుత శిల్ప సంపదతో భక్తులను మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి.
భగవద్రామానుజాచార్యుల ఆదేశాల మేరకు తిరుమల తరహాలో శ్రీ గోవిందరాజ స్వామివారికి నిత్య, వార, పక్ష, మాస, సంవత్సరోత్సవాలను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు, మాఘ మాసంలో తెప్పోత్సవాలు, చైత్ర మాసంలో వసంతోత్సవాలు, అశ్వయుజ మాసంలో పవిత్రోత్సవాలు, జ్యేష్ఠాభిషేకం, పుష్పయాగం, పొన్నకాల్వ ఉత్సవం విశేషంగా జరుగుతాయి.
ప్రతి పౌర్ణమికి గరుడసేవ, మూలమూర్తికి పూలంగి సేవ భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతున్నాయి.
ప్రతిరోజూ భక్తులకు పొంగలి, పులిహోర, పెరుగన్నం, దోసెలను నైవేద్య ప్రసాదాలుగా అందిస్తున్నారు. ప్రత్యేక పర్వదినాల్లో చక్కెర పొంగలి, సీరా, క్షీరాన్నం, బెల్లం దోశ, అప్పం, లడ్డూ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేస్తున్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంతో పాటు శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయ కైంకర్యాలను పర్యవేక్షించేందుకు ఉత్తర మాడ వీధిలో పెద్ద జీయర్ మఠం, సన్నిధి వీధిలో చిన్న జీయర్ మఠాన్ని భగవద్రామానుజాచార్యులు ఏర్పాటు చేశారు.
ఆలయానికి ఎదురుగా సుమారు 2.5 ఎకరాల విస్తీర్ణంలో వెలసిన స్వామివారి పుష్కరిణి ఆధ్యాత్మిక కాంతిని విరజిమ్ముతోంది. ప్రతిరోజూ టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించే భక్తి, ఆధ్యాత్మిక, సంగీత కార్యక్రమాలు భక్తులను ఆహ్లాదపరుస్తున్నాయి. ప్రతి ఏడాది నిర్వహించే ఏడు రోజుల తెప్పోత్సవాలు వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంటాయి. పుష్కరిణిలో అలంకరించిన తెప్పపై స్వామివారి విహారం దర్శించుకోవడం భక్తులకు అరుదైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది. రామాయణం, మహాభారతం, భాగవత ఘట్టాలతో, శిల్పకళా సంపదతో, వైష్ణవ సంప్రదాయ మహిమతో వెలసిన ఈ మహాక్షేత్రం తిరుపతి ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెబుతోంది.








