శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి గుడిలో
తిరుపతి : తిరుపతి లోని నారాయణ వనం శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మే 24న ఆదివారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఉదయం 8.15 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఈ పవిత్ర కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇదిలా ఉండగా మే 28 నుండి జూన్ 5వ తేదీ వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు ఆలయ పవిత్రత, శోభను మరింత పెంపొందించే ఉద్దేశంతో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆలయ సంప్రదాయంగా కొనసాగుతోంది.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితరాలను శుద్ధి జలాలతో పరిశుభ్రం చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలను కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనంతరం మధ్యాహ్నం 2.30 గంటల నుండి భక్తులను సర్వ దర్శనానికి అనుమతించారు. ఇదిలా ఉండగా ఉత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి విస్తృతంగా ఏర్పాట్లు చేసింది.







