ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
కరీంనగర్ జిల్లా : బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఈతవనం, తాటివనం పూర్తిగా దగ్ధమై గౌడ సోదరులు తీవ్రంగా నష్టపోయిన ఘటనపై ఆరా తీశారు. ఈ సందర్బంగా ఇవాళ ఎమ్మెల్యే సంఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలతో మాట్లాడిన ఎమ్మెల్యే జరిగిన నష్టంపై ఆవేదన వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదం కారణంగా జీవనాధారం కోల్పోయిన గౌడ కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
బాధితులకు తక్షణ నష్టపరిహారం అందించాలంటూ జిల్లా కలెక్టర్ తో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. అలాగే ఎక్సైజ్ సీఐ తో కూడా మాట్లాడి సంబంధిత శాఖల ద్వారా బాధిత కుటుంబాలకు వెంటనే సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి గౌడ సోదరులకు తగిన ఆర్థిక సహాయం అందించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, వారికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.





