నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే మందుల శామ్యూల్
హైదరాబాద్ : జనసేన పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మందుల శామ్యూల్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బిడ్డా పవన్ జర నోరు జాగ్రత్త. ఇంకోసారి తెలంగాణ పట్ల, ఈ ప్రాంతపు భాష, యాస, ప్రజల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. చిల్లర రాజకీయాలు చేయాలని చూస్తే పుట్టగతులు ఉండవన్నారు. హైదరాబాద్ నీరు మాదే, గాలి మాదే, రోడ్లు మావే, చివరికి మేము తినే తిండి కూడా మాదే… మీరు ఇక్కడే నివసించండి. కానీ, మా ఐక్యతపై మీరు దాడి చేస్తే మాత్రం, మేము చేతులు కట్టుకుని కూర్చోమని హెచ్చరించారు.
పవన్ కళ్యాణ్ సినిమాలకు తెలంగాణలో అభిమానులు ఉన్నారని, అంత మాత్రాన నోటికి ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ ఎవరూ ఊరికే లేరన్నారు. కేంద్రంలో బీజేపీ ఉందనే భ్రమలో ఉన్నావని, వారి ఆటలు, నీ ఆటలు ఇక్కడ సాగవని, ఇది గుర్తిస్తే నీకే మంచిదని పవన్ కళ్యాణ్ కు మందుల శామ్యూల్ హితవు పలికారు. మీరు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే, ఆ అభిమానులే మీకు శత్రువులుగా మారుతారని నొక్కి చెప్పారు. పవన్ మాటలు, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ముఖంపై ఉమ్మివేసిన విషం లాంటివన్నారు.





