ప్రతి నెలా ఒకటో తేదీన ఇస్తామన్న సర్కార్
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలం అయ్యిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి నెలా ఒకటో తేదీన అందరికీ వేతనాలు వారి వారి ఖాతాలలో జమ చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ రోజు రోజుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. కేవలం రోజూ వారీ ఖర్చులకు కూడా నడవని పరిస్థితి నెలకొందని టాక్. ఇదిలా ఉండగా ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అనే ప్రతిపాదన కేవలం ప్రచారానికే పరిమితం అయ్యిందటూ వాపోతున్నారు పలువురు బాధిత ఉద్యోగులు. మొన్నటికి మొన్న రిటైర్డ్ ఎంప్లాయిస్ తమకు రావాల్సిన బకాయిల కోసం హైకోర్టును ఆశ్రయించారు. చివరకు కోర్టు సీరియస్ కావడంతో కొంత సర్దుబాటు చేసింది.
మరో వైపు పదవీ బాధ్యతలు చేపట్టి 5 నెలలు గడిచినా ఇంకా జీతాల కోసం ఎదురు చూస్తున్నారు సర్పంచులు. ఇంకో వైపు గత రెండు నెలలుగా జీతాలు అందక పోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు అంగన్వాడీ టీచర్లు, సహాయకులు . డిసెంబర్ 22, 2025న బాధ్యతలు చేపట్టిన 12,762 మంది గ్రామ పంచాయతీ సర్పంచులకు, ఒక్కొక్కరికి ₹32,500 చొప్పున మొత్తం ₹41.28 కోట్ల బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉందని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా 62,000 మంది అంగన్వాడీ టీచర్లు , సహాయకులకు రెండు నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించ లేదని వాపోయారు.





