స్పష్టం చేసిన విశాఖ రేంజ్ ఐజీ గోపినాథ్ శెట్టి
విశాఖపట్నం : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నం రేంజ్ పోలీసు కార్యాలయ ఆవరణలో పర్యావరణ పరిరక్షణ, మొక్కలు నాటే కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ రేంజ్ ఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి ముఖ్య అతిథిగా విచ్చేసి, కార్యాలయ సిబ్బందితో కలిసి స్వయంగా మొక్కలు నాటారు. ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని “భూ పునరుద్ధరణ, ఎడారీకరణ , కరవును తట్టుకునే శక్తిని పెంపొందించడం” అనే ముఖ్యమైన ఆశయంతో నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ప్రకృతిని కాపాడుకోవడం అంటే మనల్ని మనం కాపాడు కోవడమేనని అన్నారు ఐజీ. భూమి మన ఇల్లు, ప్రకృతి మన జీవనాధారం. మారుతున్న కాలంలో పర్యావరణ సమతుల్యతను కాపాడటం, పచ్చదనాన్ని పెంపొందించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని అన్నారు. సహజ వనరులను వృధా చేయకుండా గాలి, నీరు, నేలను కలుషితం కాకుండా చూడాలన్నారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా, నాటిన ప్రతి మొక్కను బాధ్యతగా సంరక్షించి వృక్షాలుగా మార్చాలని పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి పర్యావరణ పరిరక్షణకు ఇచ్చిన పిలుపును స్ఫూర్తిగా తీసుకుని, రేంజ్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది , ప్రజలు అందరూ పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఐజీ ఆకాంక్షించారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సామాజిక హితాన్ని కోరి రేంజ్ పరిధిలో ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.





