41 దుకాణాలకు నోటీసులు జారీ చేసిన సంస్థ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దూకుడు పెంచింది డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ). 166 మెడికల్ షాపులను తనిఖీ చేసింది. ఇందులో 41 మందుల దుకాణాలకు నోటీసులు జారీ చేసింది. ఆన్లైన్ ఫార్మసీలను లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక తనిఖీలో, చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్లు లేకుండా మందులు అమ్మడం, రికార్డులను సరిగా నిర్వహించక పోవడం వంటి పలు ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. తనిఖీల సందర్భంగా అధికారులు అనేక అవకతవకలను గుర్తించారు. వాటిలో సేల్స్ బిల్లులను నిర్వహించక పోవడం లేదా సమర్పించక పోవడం, ప్రిస్క్రిప్షన్ మందులు, షెడ్యూల్ హెచ్1 రిజిస్టర్లను నిర్వహించక పోవడం, కొనుగోలు ఇన్వాయిస్లు లేకపోవడం, రిజిస్టర్డ్ వైద్యుల నుండి చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్లు లేకుండా మందులు పంపిణీ చేయడం బయట పడ్డాయి.
అంతే కాకుండా రిజిస్టర్డ్ ఫార్మసిస్టుల పర్యవేక్షణ లేకుండా మందులు అమ్మడం వంటివి ఉన్నాయి. డీసీఏ ప్రకారం తనిఖీ చేసిన షాపులలో 159 ఆన్లైన్ మందుల డెలివరీ సేవలకు సంబంధించినవి కావడం గమనార్హం. వీటిలో ఆన్లైన్ ఫార్మసీ ఆపరేటర్ల లైసెన్స్ పొందిన ప్రాంగణాలు, వారి భాగస్వామ్య ఫార్మసీలు కూడా ఉన్నాయి. మిగిలిన ఏడు షాపులు ఇండియామార్ట్ వంటి ఆన్లైన్ బిజినెస్-టు-బిజినెస్ ప్లాట్ఫారమ్లతో అనుబంధం కలిగి ఉన్నాయి. తనిఖీల సమయంలో అధికారులు అనేక అవకతవకలను గుర్తించారు. దీంతో 41 మెడికల్ షాపులకు షో కాజ్ నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం, 1940 సంబంధిత నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.





