మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి ఫైర్
అమరావతి : రాష్ట్ర రోడ్డు రవాణా శాఖా మంత్రి రాం ప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో వైసీపీ హయాంలో మంత్రిగా పని చేసిన ఆర్కే రోజా సెల్వమణి ఆధ్వర్యంలో జరిగిన ఆడుదాం ఆంధ్రాపై తమ కూటమి సర్కార్ వచ్చాక విచారణకు ఆదేశించామన్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన విజిలెన్స్ నివేదిక బయటకు వస్తుందని నొక్కి చెప్పారు. ఇదిలా ఉండగా మాజీ మంత్రిపై సంచలన ఆరోపణలు చేశారు. ఏకంగా ఆడుదాం ఆంధ్రాలో రూ. 100 కోట్లకు పైగా అవినీతి చోటు చేసుకుందన్నారు.
ఇందుకు సంబంధించి పూర్తి వాస్తవాలు, ఆధారాలతో నివేదిక వస్తుందని ఆ నమ్మకం తమకు ఉందన్నారు. రిపోర్టు వచ్చాక ఎవరు ఏమిటో బయట పెడతామని, తప్పు చేసిన వారు జైలుకు వెళ్లక తప్పదన్నారు మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి. తప్పు చేసిన వారు భయంతో ముందుగానే స్పందిస్తున్నారని ఎద్దేవా చేశారు.. నివేదిక వచ్చిన తర్వాత తప్పు చేసిన వారెవరూ తప్పించు కోలేరన్నారు. డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ అమలులో ఎలాంటి లోపాలు లేవు అన్నారు. .ఉద్యోగాలు చేసుకునే 16 వేల మందిని అసత్య ఆరోపణలతో అవమానిస్తున్నారని ఆరోపించారు మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి.






