ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంత్రి వంగలపూడి అనిత
అమరావతి : తనకు గంగపుత్రుల కుటుంబాలతో విడదీయలేని అనుబంధం ఉందన్నారు హొం శాఖ మంత్రి వంగలపూడి అనిత. తన నియోజకవర్గానికి బీసీ వెల్ఫేర్ బాలికల హాస్టల్ను మంజూరు చేయించామని, త్వరలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. సుమారు తొమ్మిది వేల మత్స్యకార కుటుంబాలు ఉన్నాయని, వారి సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని అన్నారు. ఈ రెండు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు వేలాది మత్స్యకార కుటుంబాలకు ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. గత ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని అన్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత ప్రజల మనసు గెలుచుకున్న నాయకురాలని, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి జనార్దన్ రెడ్డి ప్రశంసించారు. ఇదిలా ఉండగా నక్కపల్లి మండలంలోని ఉద్దండపురం నుంచి తిరుపతిపాలెం వరకు ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో రూ.7.03 కోట్ల వ్యయంతో నిర్మించిన రహదారిని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, పెట్టుబడులు , మౌలిక సదుపాయాలు (ఆర్ అండ్ బీ) శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు





