
అసెంబ్లీలో సీఎం నారా చంద్రబాబు నాయుడు
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ప్రతి ఏటా రాష్ట్రంలో 63.50 లక్షల మందికి పెన్షనల్లు ఇస్తున్నామని చెప్పారు. ప్రతి ఏటా ఇందుకోసం రూ. 32,143 కోట్లు ఖర్చు అవుతోందన్నారు. ప్రతినెలా ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు ఎంతో ఆలోచించి పేదల సేవలో అని పేరు పెట్టామన్నారు. ప్రతి నెలా ఫించన్లు అందించే కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతృప్తినిస్తోందని చెప్పారు. ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం కింద పెద్ద ఎత్తున ఫించన్లు ఇస్తున్నామని అన్నారు. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో ఇవ్వనన్ని ఫించన్లను మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందని చెప్పారు చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఫించన్లను ఇవ్వకుండా వృద్ధులను ఇబ్బంది పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో ఫించన్ల పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు.
సచివాలయాల ఉద్యోగులు పోటీ పడి తొలిరోజునే 97 శాతం ఫించన్ల పంపిణీని పూర్తి చేస్తున్నారని వెల్లడించారు. నెలకు రూ.2745 కోట్లను ఫించన్లకు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు సీఎం. మొత్తంగా 63.50 లక్షల మందికి ఫించన్లను పంపిణీ చేస్తున్నామన్నారు. ఫించన్లు అందుకుంటున్న వారిలో 59 శాతం మంది మహిళలే ఉన్నారని తెలిపారు. ఫించన్లు ఇవ్వడమే కాకుండా.. పంపిణీ ఎలా జరుగుతుందన్న అంశం మీద లబ్దిదారుల నుంచి అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నామని చెప్పారు సీఎం. ఏపీ తర్వాత తెలంగాణ, కేరళ రాష్ట్రాలు పెన్షన్లు ఇవ్వడంలో 2వ, 3వ స్థానాల్లో ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో ఏడాదికి రూ.8,179 కోట్లు, కేరళ రూ.7295 కోట్లు పెన్షన్లు కింద ఖర్చు పెడుతున్నాయని వెల్లడించారు. అంటే పెన్షన్ల కోసం ఏపీ ఖర్చు పెట్టే దాంట్లో పావు వంతు ఖర్చు పెడుతున్నాయన్నారు.