హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో VB-G RAM G చట్టాన్ని జూలై 1 నుండి అమలు చేయడానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అదే సమయంలో, ఈ చట్టంలోని కొన్ని నిబంధనలు రాష్ట్రాల ప్రయోజనాలకు విరుద్ధంగానూ, సమాఖ్య స్ఫూర్తికి భంగం కలిగించేవి గానూ ఉన్నాయని భావిస్తూ వాటిని సుప్రీంకోర్టులో సవాలు చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కొత్త చట్టం అమలుపై మంత్రివర్గం సమగ్రంగా చర్చించిందని, రాష్ట్రాలను సంప్రదించకుండానే పొందుపరిచిన అనేక నిబంధనలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిందని ఆయన తెలిపారు.
తెలంగాణలో రూ. 30,000 జీతం , ఉద్యోగ భద్రత కోసం డిమాండ్. గ్రామీణ కూలీలకు ఉపాధి భద్రత కల్పించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS)లో ఎలాంటి మార్పులు చేయవద్దని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ ఈ ఏడాది జనవరిలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని మంత్రివర్గం గుర్తు చేసుకుందన్నారు. ఈ విషయంలో రాష్ట్రం వ్యతిరేకతను మరోసారి కేంద్రానికి తెలియ జేయాలని నిర్ణయించింది. నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉప-సంఘం చేసిన సిఫార్సులపై కూడా మంత్రివర్గం చర్చించిందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపే VB-G RAM G పథకాన్ని అమలు చేయాలన్న కేంద్రం ఏకపక్ష నిర్ణయం, సమాఖ్య వ్యవస్థకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఉప-సంఘం నిర్ధారించింది















