అమరావతి : ఏపీ మాజీ సీఎం జగన్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాజధాని పేరుతో గతంలోనే వేల ఎకరాలు తీసుకున్నారు. మొదట భూములు ఇచ్చిన రైతులకే దిక్కులేకుండా చేసిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ కొత్తగా భూముల కోసం ఎందుకు రైతులను వెంటాడుతోంది? అని ప్రశ్నించారు. రైతులపై పోలీసులను ప్రయోగించడం ఏమిటి? రైతుల అంగీకారం లేకుండా వారి భూములపై ప్లాన్లు గీయడం, కాగితాల మీద అవార్డులు ప్రకటించుకున్నామని చెప్పడం దారుణమన్నారు. ఆ వివరాలను కూడా రైతులకు తెలియ జేయకుండా ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడం న్యాయమేనా? అని ప్రశ్నించారు.
ఈ భూములు మారుమూల ప్రాంతాల్లో లేవు. విజయవాడకు కూతవేటు దూరంలో, చెన్నై–కోల్కత జాతీయ రహదారికి అత్యంత సమీపంలో, తాడేపల్లి నగర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అత్యంత విలువైన భూములు. మార్కెట్లో భారీ ధరలు పలికే భూములకు అరకొర విలువలను మీరే నిర్ణయించుకుని, రైతుల సమ్మతి లేకుండా వాటిని లాక్కోవడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల భూములను తీసుకుని భవిష్యత్తులో ఎవరికి కట్టబెట్టాలని అనుకుంటున్నారు? అసలు లబ్ధిదారులు రైతులా? లేక చంద్రబాబు అస్మదీయులా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల భూములను బలవంతంగా లాక్కుని, వారిని రోడ్డుమీద పడేసి, వారి జీవితాలను దెబ్బతీస్తామంటే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. . రైతు స్వచ్ఛందంగా భూమి ఇస్తే తీసుకోండి. కానీ పోలీసులను పెట్టి, పంటలను ధ్వంసం చేసి, రైతులను ఈడ్చిపారేసి లాక్కుంటామంటే అది ముమ్మాటికీ తప్పే అవుతుందన్నారు జగన్ రెడ్డి.





