హైదరాబాద్ లో పోలీసుల ఆంక్షలు
హైదరాబాద్ – న్యూ ఇయర్ సందర్బంగా హైదరాబాద్ లో రాత్రి 11 గంటల వరకు ట్రాంక్ బండ్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఐటీ కారిడార్ లో ఫ్లై ఓవర్లు మూసి వేస్తున్నట్లు ప్రకటించారు. సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం వరకు నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేపడతామన్నారు. జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ లో పలు పబ్బులు, బార్లపై నిఘా పెట్టామన్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సీరియస్ గా స్పందించారు. నియమ నిబంధనలు ఎవరైనా సరే పాటించాలని స్పష్టం చేశారు. గీత దాటితే చర్యలు తప్పవని అన్నారు. జీవితం విలువైనదని, వేడుకల్లో పాల్గొనడంలో తప్పు లేదని కానీ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ప్రత్యేకించి పిచ్చి పిచ్చి చేష్టలు చేసినా, ఇతరుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా చూస్తూ ఊరుకునేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నగర భద్రత అత్యంత ముఖ్యమని అన్నారు. ఇందులో ఎక్కడా రాజీ పడే ప్రసక్తి లేదన్నారు సీపీ సీవీ ఆనంద్. మైనర్లను బయటకు వెళ్లకుండా పేరెంట్స్ చూసుకోవాలని స్పష్టం చేశారు. లేకపోతే పేరెంట్స్ కు కూడా కోటింగ్ ఇస్తామని హెచ్చరించారు.