స్పష్టం చేసిన ఏఈవో చౌదరి
తిరుమల – కొందరు కావాలని భక్తులను రెచ్చగొట్టేలా ప్రవర్తించడం, మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి. ప్రతి రోజూ స్వామి వారి దర్శనం కోసం 90 వేల మందికి పైగా వస్తున్నారని, వారాంతపు సెలవుల్లో లక్షా 20 వేల మందికి పైగా దర్శించుకుంటున్నారని తెలిపారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామన్నారు. టీటీడీ సిబ్బందితో పాటు శ్రీవారి సేవకులు సైతం పెద్ద ఎత్తున విధులు నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు.
సాధారణ రోజులకంటే 10 వేల మందికి భక్తులకు అదనంగా దర్శనమయ్యేందుకు టీటీడీ సిబ్బంది రాత్రింబవళ్లు నిద్ర లేకుండా కష్టపడుతున్నారని తెలియజేశారు. క్యూలైన్లలోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరాయంగా అన్న ప్రసాదాలు, టీ, కాఫీ, పాలు, మజ్జిగ, స్నాక్స్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఆరోగ్య విభాగం ద్వారా ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.
టీటీడీ సిబ్బంది కృషిని పట్టించుకోకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా కొందరు ఇలా ప్రవర్తించడం సరికాదని ఆయన తెలిపారు. కొందరు అనధికారిక వ్యక్తులు దర్శన క్యూలైన్లలో భక్తులను రెచ్చగొడుతూ వీడియోలు చిత్రీకరిస్తున్నారని, అలాంటివారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విపరీత రద్దీ నేపథ్యంలో భక్తులు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని సంయమనం పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.