మార్చి 25వ తేదీ అర్ధరాత్రి వరకు
ఢిల్లీ – దేశ వ్యాప్తంగా మార్చి 23 నుంచి బ్యాంకులు మూత పడనున్నాయి. ఈ మేరకు బ్యాంకర్స్ యూనియన్స్ సంచలన ప్రకటన చేశాయి. 23 నుంచి మార్చి 25 అర్దరాత్రి దాకా సమ్మె చేయనున్నట్లు వెల్లడించాయి. ఎనిమిది లక్షలకు పైగా ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న తొమ్మిది ప్రధాన బ్యాంకు సంఘాలతో కూడిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఈ కీలక ప్రకటన చేసింది. ఇందులో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలోని ఎనిమిది లక్షలకు పైగా ఉద్యోగులు, అధికారులు సమ్మెలో పాల్గొంటారని తెలిపాయి.
మార్చి 23 అర్ధరాత్రి నుండి 48 గంటల పాటు సమ్మె చేయనున్నట్లు ప్రకటించారు యూనియన్ నేతలు. అన్ని కేడర్లలో తీవ్ర ఉద్యోగుల కొరత ఉందని, బ్యాంకు కస్టమర్లకు సేవలను అందించడం కష్టంగా మారిందని వాపోయారు. 2013లో, బ్యాంకుల్లో 3.98 లక్షల మంది క్లర్కులు , 1.53 లక్షల మంది సబ్-స్టాఫ్లు ఉండేవారని తెలిపారు. ఇది 2024లో 2.46 లక్షల మంది క్లర్కులు , 94,000 మంది సబ్-స్టాఫ్లకు తగ్గిందన్నారు. దీని ఫలితంగా ప్రస్తుత సిబ్బందిపై విపరీతమైన పనిభారం ఏర్పడిందని వాపోయారు.
గత దశాబ్దానికి పైగా బ్యాంకులు తగినంత సిబ్బందిని నియమించకుండా తాత్సారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.బ్యాంకింగ్ పరిశ్రమలో ఐదు రోజుల పనిని అమలు చేయాలని, ఉద్యోగ భద్రతకు ముప్పు కలిగించే, ఉద్యోగులు, అధికారులలో విభజన, వివక్షను సృష్టించే పనితీరు సమీక్షపై ప్రభుత్వం, ఆర్థిక సేవల విభాగం ఆదేశాలను వెంటనే ఉపసంహరించు కోవాలని బ్యాంకు యూనియన్లు డిమాండ్ చేశాయి.