అర్జీదారులకు హోం మంత్రి హామీ
అమరావతి – ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా హోంమంత్రి వంగలపూడి అనిత ప్రజాదర్బార్ నిర్వహించారు. అర్జీదారులను నేరుగా కలిసి, ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ, వారి గోడు వింటూ, వినతులు స్వీకరించారు. హోంశాఖకు సంబంధించిన సమస్యలపై అప్పటికప్పుడు సంబంధిత శాఖ అధికారులను పరిష్కారం దిశగా ఆదేశించారు. ప్రతి ఒక్కరి సమస్యను శ్రద్ధగా వింటూ పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. పాయకరావుపేట నియోజకవర్గ ప్రజల కోసం తన కార్యాలయం ద్వారాలు తెరిచే ఉంటాయని , ఎప్పుడైనా కలిసి సమస్యలను తన దృష్టికి తీసుకు రావచ్చని వెల్లడించారు.
తక్షణమే సమస్యల పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చెయ్యాలని అధికారులను ఆదేశించారు.
సమస్యలో ఉన్న ప్రజల కన్నీరు తుడుస్తూ..వారి కష్టాలు తీరుస్తానంటూ హోం మంత్రి వంగలపూడి అనిత భరోసానిచ్చారు. ప్రతి సమస్యకూ పరిష్కారం చూపించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని స్పష్టం చేశారు. నక్కపల్లి మండలం సారిపల్లిపాలెం హోం మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద గురువారం ప్రజదర్భార్ నిర్వహించారు. అనకాపల్లి జిల్లాలో వివిధ నియోజకవర్గాలు, పాయకరావుపేట నియోజకవర్గం నాలుగు మండలాలు నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారితో ఆప్యాయంగా మాట్లాడి హోంమంత్రి అనిత సమస్యలు తెలుసుకున్నారు. ఈ గ్రీవెన్స్ కార్యక్రమానికి సుమారు 600కు పైగా అర్జీలు వచ్చాయన్నారు.
భూమి సమస్యలు, కొత్త ఫించన్లు,రేషన్ కార్డులు, కుటుంబ కలహాల నేపథ్యంలో కేసులు తదితర అంశాలపై అధికంగా ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు. పరిష్కారానికి అవకాశం ఉన్న కొన్ని అంశాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి అక్కడికక్కడే పరిష్కరించారు.