అద్భుతంగా ఆడారంటూ కితాబు
అమరావతి – మలేషియా వేదికగా జరిగిన అండర్ -19 మహిళల వరల్డ్ కప్ ఫైనల్ లో భారత జట్టు సౌతాఫ్రికాను ఓడించి కైవసం చేసుకోవడం పట్ల అభినందనలు తెలిపారు మంత్రి వంగలపూడి అనిత. తెలంగాణకు చెందిన గొంగడి త్రిష ఈ టోర్నీలో కీలక పాత్ర పోషించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మహిళల జట్టు మరిన్ని విజయాలు సాధించాలని కోరారు. రెండోసారి వరల్డ్ కప్ గెల్చుకోవడం పట్ల ఆనందంగా ఉందన్నారు.
మేటి జట్లను మట్టి కరిపించి త్రివర్ణ పతాకాన్ని రెపరెప లాడించిన అద్భుతమైన సందర్భంలో మన తెలుగు తేజాలు విశాఖకు చెందిన షబ్నమ్ షకీల్, తెలంగాణకు చెందిన గొంగడి త్రిష పాత్ర మరువలేనిదని అన్నారు.
కౌలాలంపూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో తెలుగు బిడ్డ గొంగడి త్రిష 3 వికెట్లు తీయడంతోపాటు అజేయంగా 44 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించగా.. బౌలింగ్ లో ఒక వికెట్ తీసిన షబ్నమ్ తన వంతు పాత్ర పోషించడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు వంగలపూడి అనిత. మీరు సాధించిన విజయం మరెంతో మందికి ప్రేరణ అవుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.