వెల్లడించిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండల
తిరుపతి – తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు జూన్ 07 నుండి 11వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఘనంగా జరుగనున్నాయి.ఈ ఉత్సవాల్లో శ్రీ అలమేలు మంగమ్మ పద్మసరోవర తీరంలో పాంచరాత్ర ఆగమ పూజలు అందుకుని భక్తులను అనుగ్రహిస్తారు. ప్రతి సంవత్సరం అమ్మ వారికి జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు రమణీయంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. తెప్పోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు తిప్పలు, సంసార దుఃఖాలు తొలగి, మోక్షం సిద్ధిస్తుందని నమ్మకం.
పద్మ సరస్సులో బంగారు పద్మం నుండి ఆవిర్భవించిన అలమేలు మంగ జీవకోటికి మాతృమూర్తిగా మారి భవ జలధిలో మునిగి పోకుండా రక్షించి, సర్వ సౌఖ్యాలు ప్రసాదిస్తారని తెప్పోత్సవాల అంతరార్థం. జూన్ 07వ తేదీ మొదటి రోజు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి, రెండో రోజు శ్రీ సుందర రాజస్వామి, చివరి మూడు రోజులు శ్రీ పద్మావతి అమ్మ వారు తెప్పలపై విహరిస్తారు.
తెప్పోత్సవాల్లో భాగంగా రాత్రి 7.30 – 8.30 గం.ల మధ్య శ్రీకృష్ణ స్వామి వారు, జూన్ 08వ తేదీన శ్రీ సుందర రాజస్వామి వారు, జూన్ 09వ తేదీన శ్రీ పద్మావతీ అమ్మ వారు నాలుగు మాడ వీధులలో విహరించనున్నారు. జూన్ 10వ తేదీ రాత్రి 8.30 – 10.00 గం.ల మధ్య గజ వాహనంపై, 11 తేదీ రాత్రి 8.30 – 10.00 గం.ల వరకు గరుడ వాహనంపై అమ్మ వారు భక్తులను ఆశీర్వదించనున్నారు.
జూన్ 14న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంటలకు ఆలయ మాడ వీధులలో గజ వాహనంపై అమ్మవారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. తెప్పోత్సవాల కారణంగా తిరుచానూరు అమ్మవారి ఆలయంలో ఐదు రోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్సేవను రద్దు చేశారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.