ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ఉండవల్లి – సంక్షేమం, అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వానికి జోడెద్దుల బండి అని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. కూటమి పాలన ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా మాట్లాడారు. ప్రజలు, ప్రజాస్వామ్యం గెలిచి ప్రజాపాలన ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంటున్నామని అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు పడిందన్నారు. విధ్వంస పాలన నుంచి ఏకంగా వికాసం వైపు మన ప్రభుత్వం ప్రయాణం ప్రారంభించిందని తెలిపారు.
ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోందన్నారు. ఉద్యోగాల విషయంలో మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులు ప్రజా ప్రభుత్వం భర్తీ చేస్తోందని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. డీఎస్సీని ఎట్టిపరిస్థితుల్లో ఆపాలని ప్రతిపక్ష పార్టీ సుమారు 24 కేసులు వేసిందని ఆరోపించారు. ఈ రోజుతో 24వ కేసు కూడా సుప్రీంకోర్టులో డిస్మిస్ అయిందన్నారు. అవన్నీ తట్టుకుని డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేస్తున్నట్లు చెప్పారు ముఖ్యమంత్రి.
గడచిన పదేళ్లలో రానిపెట్టుబడులు ఈ సంవత్సరంలో తీసుకు రావడం జరిగిందన్నారు. రూ.9.5 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 8.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ఒప్పందాలు కుదుర్చు కోవడం జరిగిందన్నారు. ఇవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. డొమెస్టిక్ ఇన్వెస్ట్ మెంట్స్ లో ఏపీ భారతదేశంలోనే నెంబర్ వన్ గా ఉంది. 16 శాతం పెట్టుబడులు ఏపీకి వచ్చాయన్నారు.
ఇందులో భాగంగా టీసీఎస్, ఎల్జీ, ఎన్టీపీసీ గ్రీన్, ఆర్సెల్లార్ మిట్టల్, బీపీసీఎల్, రిలయన్స్ రెన్యూ పవర్ లాంటి సంస్థలు ఈ రోజు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కనుకనే విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోగలిగామని అన్నారు. . రైల్వేజోన్ సాధించాం. అంతే కాకుండా భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు సీఎం.