12న రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవ ర్యాలీలు
అమరావతి – రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 12వ తేదీన విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందన్నారు సీఎం చంద్రబాబు. ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొదటి సారి గెలిచిన ఎమ్మెల్యేలు మరింత బాధ్యతగా పనిచేయాలని స్పష్టం చేశారు. ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలన్నారు. ఎమ్మెల్యేగా గెలిచాం కదా అని ఎవరైనా ఓవర్ కాన్ఫిడెన్స్ కు పోతే వారికే ఎక్కువ నష్టం జరగుతుందని హెచ్చరించారు. మీరు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలి పోకూడదు అనేది తన ఆలోచన అని పేర్కొన్నారు.
అధికారంలో ఉన్న మనల్ని ప్రజలు అన్ని రకాలుగా గమనిస్తుంటారని , జాగ్రత్తగా ఉండాలని సూచించారు చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వాన్ని భరించ లేకే ప్రజలు ఏకపక్షంగా మనకు ఓట్లువేసి గెలిపించారన్న విషయం మరిచి పోకూడదన్నారు.. అధికారంలో ఉన్నప్పుడు మరింత బాధ్యతగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. శాశ్వతంగా ప్రజలు మనతో ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రజల్లో మరింత నమ్మకాన్ని కలిగించాలని పేర్కొన్నారు సీఎం.
ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేసి నివేదికల తెప్పించు కుంటున్నానని చెప్పారు. మంచి చేస్తే అభినందిస్తా…ప్రోత్సహిస్తా….అవకాశాలు కల్పిస్తా….తప్పు చేస్తే మాత్రం దూరం పెడతానని వార్నింగ్ ఇచ్చారు. రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. ఈ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు.
మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపిలు తమ పనితీరుతో ప్రజలకు దగ్గర అయ్యారు. వీరి వల్ల పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందన్నారు. అయితే ఒకరిద్దరు వల్ల అక్కడక్కడా నష్టం కూడా జరుగుతోందన్నారు. ఒకరి కోసం పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందంటే మాత్రం అలాంటి నేతలను దూరంగా పెడతానని వార్నింగ్ ఇచ్చారు.