వర్షాల సమాచారం రైతులకు చేరవేయాలి
అమరావతి – మరోసారి బంగళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడింది. ఇప్పటికే రాష్ట్ర వాతావరణ శాఖ డైరెక్టర్ డాక్టర్ రోణంకి కూర్మనాథ్ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో రాష్ట్ర కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది. పలు జిల్లాల్లో కలెక్టర్లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
పెద్ద ఎత్తున కురుస్తున్న వర్షాల కారణంగా విశాఖపట్నంలో అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్ హరిందర్ ప్రసాద్. ఇదిలా ఉండగా శనివారం రంగంలోకి దిగారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. సచివాలయంలో అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం సమీక్ష చేశారు.
సీఎంవో అధికారులు ఆయా జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రికి వివరించారు. కలెక్టర్లు, జిల్లా స్థాయిలో అధికారులు తీసుకుంటున్న చర్యలు, అప్రమత్తతపై వివరించారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు. స్కూళ్లకు సెలవు ప్రకటించినట్లు సీఎంకు వివరించారు.
కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని..వర్షాల అనంతరం పంట నష్టం వివరాలు సేకరించి రైతులకు సాయం అందేలా చూడాలని చంద్రబాబు నాయుడు అదేశించారు. భారీ వర్షాల సమాచారాన్ని ఎప్పటికిప్పుడు రైతులకు చేరేలా చూడాలని సూచించారు. అన్ని స్థాయిల్లో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.