జగన్ వల్లే ఆలస్యమైందన్న బాబు
అమరావతి – పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉండేదన్నారు. గతప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందని ఆరోపించారు. తాము వచ్చాక తిరిగి ప్రాజెక్టుపై పూర్తిగా ఫోకస్ పెట్టడం జరిగిందన్నారు సీఎం. ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో ఖర్చు భారీగా పెరిగి పోయిందన్నారు. 2014-2019 మధ్య 33 సార్లు ప్రాజెక్ట్ సందర్శించానని చెప్పారు. గత సీఎం ఐదేళ్లలో ఒక్కసారైనా కనిపించారా అని ప్రశ్నించారు. పోలవరం కోసం నిర్వాసితులు భూమిని త్యాగం చేశారని ప్రశంసించారు. గతంలో నిర్వాసితులకు రూ.4,311 కోట్లు చెల్లించామని తెలిపారు చంద్రబాబు.
పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు సీఎం చంద్రబాబు నాయుడు. నిర్వాసితులను గత ప్రభుత్వం పట్టించు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.10 లక్షల చొప్పున ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. నిర్వాసితులను ఆదుకున్న ప్రభుత్వం తమదేనని అన్నారు. నిర్వాసితులకు రూ.828 కోట్లు విడుదల చేశామని చెప్పారు. 2026 డిసెంబర్ నాటికి పునరావాసం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు చంద్రబాబు నాయుడు. మధ్యవర్తులు లేకుండా నిర్వాసితుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్నారు. పునరావాసం కల్పించాకే ప్రాజెక్టులో నీళ్ల నిల్వ చేస్తామన్నారు. 2027లో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.