సీఎం చంద్రబాబుతో మాట్లాడతానన్న పవన్
తమిళనాడు – దక్షిణ భారత దేశ ఆలయాల సందర్శనలో బిజీగా ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పళనిలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ, పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామికి తనయుడు అకిరా నందన్ , టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద సాయితో కలిసి పూజలు చేశారు.
పళని నుంచి పెద్ద ఎత్తున తిరుమలకు వస్తుంటారని, వారికి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీఎంతో మాట్లాడుతామని చెప్పారు. పళని శ్రీ అర్ములిగ దండాయుధ మురుగన్ స్వామి వారి సన్నిధిలో కొంత సేపు సేద దీరారు పవన్ కళ్యాణ్ . అనంతరం మీడియాతో మాట్లాడారు.
పళనిలో అత్యంత ముఖ్యమైన పండుగగా పరిగణించే థాయ్-పూసం, తమిళ థాయ్ పౌర్ణమి రోజున జరుపు కోవడం ఆనందంగా ఉందన్నారు. మురుగన్ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆధ్యాత్మిక ఆనందంలో మునిగి పోయానని చెప్పారు. దైవిక మిశ్రమంగా పిలిచే తేనె, ఖర్జూరం, అరటిపండు, ఎండుద్రాక్ష, బెల్లం కలిపిన పంచమిర్దం అందించారని, దానిని మహా ప్రసాదంగా స్వీకరించానని చెప్పారు.
శ్రీ పళని సుబ్రమణ్య స్వామి క్షేత్రం నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు సులభంగా వచ్చేలా రవాణా సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెడతామన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకు వెళతానని హామీ ఇచ్చారు.