Monday, April 7, 2025
HomeDEVOTIONALరాములోరి క‌ళ్యాణోత్స‌వానికి ఏర్పాట్లు

రాములోరి క‌ళ్యాణోత్స‌వానికి ఏర్పాట్లు

మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డి

తిరుప‌తి – ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 11న జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణోత్సవం పండుగ వాతావరణంలో భక్తులందరూ వీక్షించేలా ఏర్పాట్లు చేపట్టాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సూచించారు. ఈ సందర్భంగా స‌మీక్ష చేప‌ట్టారు. రాష్ట్ర విభజన అయ్యాక రాష్ట్ర దేవాదాయ శాఖ నుండి ఒంటిమిట్ట ఏకశిలానగరాన్ని 2015లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో టిటిడిలో విలీనం చేశారని అన్నారు. అప్పటి నుండి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో టిటిడి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని గుర్తు చేశారు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం సూచనలతో తొలిసారి శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు.

ఆగమ శాస్త్రం ప్రకారం ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ఆలయాల్లో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు ఆనం రామ నారాయ‌ణ రెడ్డి. నారా చంద్ర బాబు నాయుడు ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిపించాలని, అన్నమయ్య నివసించిన ప్రాంతం కనుక ఇక్కడే టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణం నిర్వహించాలని భావించారని గుర్తు చేశారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని నిర్ణయించారని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ పండుగకు ముత్యాల తలంబ్రాలు సమర్పించదానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తున్నారని వెల్లడించారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు విశేషంగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అందుకు తగ్గట్టుగా టిటిడి , జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. సీఎం వచ్చి వెళ్లేంత వరకు పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కోరారు. హైవే సెక్టార్ లలో తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల నుండి అంబులెన్స్ లను అదనంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

సీసీ కెమెరాలు , డ్రోన్ కెమెరాలు పెంచాలని, వేసవి నేపథ్యంలో ఫైర్ సర్వీస్ మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భక్తులు వెలుపలికి సులువుగా వచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని, పార్కింగ్ కొరకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఒంటిమిట్ట ఆలయాన్ని ఒక గొప్ప పుణ్య క్షేత్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు.

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, కడప జిల్లా ఇంఛార్జి మంత్రి ఎస్. సవిత మాట్లాడుతూ, అందరూ కలిసి కట్టుగా సమిష్టిగా పనిచేసి శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. కల్యాణ వేదిక ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

సమీక్షకు ముందు కల్యాణోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రులకు జిల్లా కలెక్టర్, టిటిడి జేఈవో, జిల్లా ఎస్పీ, టిటిడి సివిఎస్వో లు నివేదించారు. అంతకు ముందు కల్యాణ ప్రాంగణం వద్ద భక్తుల కోసం చేపడుతున్న ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, ఎం. రామ్ ప్రసాద్ రెడ్డి, ఎస్. సవిత జిల్లా కలెక్టర్ సి. శ్రీధర్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, టిటిడి జేఈవో వి వీరబ్రహ్మం, సివిఎస్వో హర్షవర్ధన్ రాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తదితర ఉన్నతాధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు.

ముందుగా రాష్ట్ర మంత్రులు శ్రీ కోదండరామ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న మంత్రులకు టీటీడీ జెఈఓ వీరబ్రహ్మం, ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా పూర్ణకుంభం స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ మండపంలో జేఈవో మంత్రులకు శేష వస్త్రం కప్పి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు.

ఈ స‌మావేశంలో టిటిడి సీఈ సత్యనారాయణ, ఆర్డీవో జాన్ ఎర్విన్, జిల్లా రెవిన్యూ, పోలీసు, హెల్త్, మెడికల్, తదితర పలువురు జిల్లా, టిటిడి అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments