ఏపీ సర్కార్ పై సీరియస్ కామెంట్స్
అమరావతి – కూటమి సర్కార్ సూపర్ సిక్స్ అట్టర్ ప్లాప్ అయ్యిందంటూ ఆరోపించారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. రాష్ట్రంలో టీడీపీ,జనసేన, వైసీపీ మూడు బీజేపీ పార్టీలేనని అన్నారు. ఒకరిది సక్రమ పొత్తు, మరొకరిది అక్రమ పొత్తు అంటూ ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో జగన్ కూడా బీజేపీ కి ఊడిగం చేశాడని మండిపడ్డారు. వైఎస్సార్ పేరు చెడగొట్టాడని అన్నారు. రాష్ట్రానికి ఏ ఒక్క మేలు చేయని బీజేపీకి మద్దతు పలకడం దారుణమన్నారు.
బీజేపీ గత 11 ఏళ్లుగా మోసం చేస్తూనే ఉందన్నారు. ప్రత్యేక హోదా పేరుతో ఇంకెంత కాలం నమ్మిస్తారంటూ ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి అన్యాయం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం తరపున ఏ ఒక్క ఎంపీ నోరు మెదప లేదన్నారు. ఒక్కరికీ కూడా బీజేపీపై, ప్రధాని మోదీ, అమిత్ షాలపై మాట్లాడే దమ్ము ధైర్యం లేకుండా పోయిందన్నారు. ఇక వీళ్లను ఎన్నుకున్నది ఇందు కోసమేనా అని నిలదీశారు వైఎస్ షర్మిల.
విభజన హామీలు విస్మరిస్తుంటే నోరు మెదపక పోవడం దారుణమన్నారు. రాజధాని నిర్మాణం పూర్తిగా కేంద్రానిదే బాధ్యత అని స్పష్టం చేశారు. మరోసారి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఏం సాధించారని, ఏం ఒరగ బెట్టారని విజయోత్సవాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రజలు ఓ వైపు సమస్యలతో సతమతం అవుతుంటే ఇంకోవైపు సుపరిపాలన పేరుతో జనం చెవ్వుల్లో పూలు పెడుతున్నారంటూ సీరియస్ అయ్యారు. డబుల్ ఇంజన్ సర్కార్ కాదిది ట్రబుల్ ఇంజన్ సర్కార్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి లేదు..మహిళలకు మహిళా శక్తి ఎక్కడుందో తెలియదన్నారు షర్మిల.