వెల్లడించిన టీటీడీ ఈవో జె. శ్యామల రావు
తిరుమల – శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పారు టీటీడీ ఈవో శ్యామల రావు. ఏప్రిల్ నెల కోటాకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఈనెల 21న విడుదల చేయనున్నట్లు తెలిపారు. కల్యాణ ఉత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లతో పాటు ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు నిర్వహించనున్న సాలకట్ల వసంతోత్సవాల ఆర్ధిత సేవా టికెట్లను ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామన్నారు శ్యామల రావు.
అంతే కాకుండా వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఏప్రిల్ నెల కోటాను జనవరి 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుందన్నారు. అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను జనవరి 23న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామన్నారు జె. శ్యామల రావు.
శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఏప్రిల్ నెల ఆన్ లైన్ కోటాను జనవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తామన్నారు. వయో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మార్చి నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను జనవరి 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుందన్నారు.
ఏప్రిల్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జనవరి 24న ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేస్తుందన్నారు. తిరుమల, తిరుపతిలలో ఏప్రిల్ నెల గదుల కోటాను జనవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామన్నారు.
https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.