అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు
తిరుపతి – తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. రాత్రి 7 గంటలకు అశ్వ వాహనంపై స్వామి వారు విహరించారు. పోటెత్తిన భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు గజ రాజులు నడుస్తుండగా, భక్తజన బృందాల కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు.
ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియ నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనంపై కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నారు. వాహన సేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఎఫ్ ఎ అండ్ సిఏవో బాలాజీ, ఆలయ డెప్యూటీ ఈవో శాంతి పాల్గొన్నారు.
ఉత్సవాలను పురస్కరించుకుని తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఈవో జె. శ్యామల రావు ఆదేశించారు. ఉత్సవాలు జేఈవో వీర బ్రహ్మం ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి.