తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
హైదరాబాద్ – తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టింది. ఇందులో భాగంగా అత్యంత విలువైన హౌసింగ్ బోర్డు స్థలాలను వేలం పాటకు పెట్టనుంది. దాదాపు రూ.500 నుండి రూ.600 కోట్ల ఆదాయం రానుందని, వీటి ద్వారా వచ్చిన డబ్బులను ఇందిరమ్మ ఇళ్లకు వినియోగించనుంది కాంగ్రెస్ ప్రభుత్వం .
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో హౌసింగ్ బోర్డు పరిధిలో ఉన్న ఓపెన్ ప్లాట్లు, రాజీవ్ స్వగృహ అపార్ట్మెంట్లలో ఉన్న ఫ్లాట్లు, నిర్మాణం పూర్తవ్వని టవర్లను వేలం వేయాలని నిర్ధారించింది. ఇప్పటికే కూకట్పల్లి, మహబూబ్నగర్ లోని ప్లాట్ల విక్రయానికి ప్రకటనలు ఇచ్చింది సర్కార్. త్వరలో మరికొన్నింటిని, మిగిలి పోయిన వాటిని వేలం వేయాలని నిర్ణయించారు.
కూకట్పల్లిలోని 18 ప్లాట్ల వేలం ద్వారా దాదాపు రూ.150 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు హౌసింగ్ బోర్డు ఆఫీసర్లు. వికారాబాద్ జిల్లాలోని పరిగి, రంగారెడ్డి జిల్లాలోని గచ్చిబౌలి, రావిర్యాల, లక్ష్మీదేవిపల్లి, గద్వాల జిల్లా, వరంగల్ జిల్లాలో ఉన్న ప్లాట్లకు త్వరలోనే ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం. వచ్చే సెప్టెంబర్ నెల లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.