కొమ్మినేని అరెస్టుపై బాలకోటయ్య వ్యాఖ్య
అమరావతి – పోలీసులు అరెస్టు చేసింది జర్నలిస్ట్ కొమ్మినేనిని కాదని, వేశ్యల రాజధాని అమరావతి అంటూ రాజధాని రైతు మహిళలపై కారుకూతలు కూసిన కొమ్మినేని శ్రీనివాసరావును అని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన కొమ్మినేని అరెస్టుపై మీడియాతో మాట్లాడారు. వైకాపా పూర్వపు సకల శాఖా మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు, వైకాపా మీడియా యాభై ఏళ్ళ పాత్రికేయ అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్టును అరెస్టు చేస్తారా? అంటూ ప్రభుత్వంపై సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఎద్దేవా చేశారు.
స్వాతంత్ర్య సమర యోధుడిని అరెస్టు చేసినట్లు వాపోతున్నారని బాల కోటయ్య మండిపడ్డారు. కేవలం వాట్సాప్ లో మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు 74 ఏళ్ళ కొల్లు అంకబాబును ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మద్యం ధరలపై నోరు జారిన ఓం ప్రకాష్ ఎక్కడ ఉన్నాడో తెలియ జేయాలని అన్నారు. తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధి హోదాలో పట్టాభి ఒక్క మాట అన్నందుకు మంగళగిరి తెదేపా కార్యాలయాన్ని ఏం చేశారో చెప్పాలని కోరారు.
మందులు మింగితే కానీ బతకలేని కొమ్మినేనికి గుమ్మాల దగ్గర ఊడిగం దేనికి అని ప్రశ్నించారు బాల కోటయ్య. కొమ్మినేని అరెస్టులో రాజకీయం లేదని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలల్లో పెల్లుబికిన నిరసనలు, ఫిర్యాదు ఆధారంగానే అరెస్టు చేసిన విషయాన్ని పోలీసులే ఆయనకు చెప్పారని అన్నారు. అమరావతి పనులపై జర్నలిస్టులు మాట్లాడొచ్చని, నోటి దూలతో మాట్లాడకూడదని, ఇది అందరికీ వర్తించే విషయమని స్పష్టం చేశారు. ఈ చర్యతోనైనా అమరావతిపై రాజకీయ కక్ష ఉన్నవాళ్ళు, ఏం పీకుతారులే అనే స్వభావం ఉన్న కుహనా మేధావులు జాగ్రత్తగా నోళ్ళకు తాళాలు వేయాలని బాలకోటయ్య హితవు పలికారు.