బీజేపీ సీనియర్ నేత నవీన్ కుమార్ రెడ్డి
తిరుపతి – తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తిరుపతి వాసులకు శ్రీవారి దర్శన భాగ్యం ప్రత్యేకంగా కల్పించాలని తీర్మానం చేసింది. ఈ సందర్భంగా టీటీడీ నూతన ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయం పట్ల స్పందించారు తిరుపతి భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత నవీన్ కుమార్ రెడ్డి. ఎక్స్ వేదికగా ఆయన వీడియోను విడుదల చేశారు.
తిరుపతి నగర వాసులందరి తరపున టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు ధన్యవాదాలు తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానికులకు ఆధార్ కార్డు ఆధారంగా ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనాన్ని పునః ప్రారంభించాలని నిర్ణయించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
ప్రత్యేకించి గత 5 సంవత్సరాలుగా అనేకసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఏపీలో వైసీపీ సర్కార్ మారడం కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో తమ సమస్య తీరి పోయిందన్నారు నవీన్ కుమార్ రెడ్డి. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి సత్య కుమార్ యాదవ్, బీజేపీ చీఫ్ , ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కి కృతజ్ఞతలు తెలిపారు .
తిరుమలలో రాజకీయ ప్రసంగాలు నిషేధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అంతే కాకుండా శారదా పీఠానికి తిరుమలలో కేటాయించిన స్థలం లీజును రద్దు చేస్తూ ఆ భవనాన్ని టీటీడీ ఆధ్వర్యంలో భక్తులకు వసతి కల్పించేందుకు చర్యలు చేపట్టడం అభినందనీయం అన్నారు.
శ్రీవారి సామాన్య భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో ఉండాల్సిన అవసరం లేకుండా అతి త్వరగా వెంకన్న దర్శనం కల్పిస్తామని అందుకు తగు చర్యలు చేపడతామని ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
శ్రీవాణి ట్రస్ట్ నిధులను టీటీడీ ట్రస్ట్ ఖాతాలోకి మళ్లించే నిర్ణయం తీసుకోవడంతో పాటు జరిగిన అవకతవకలపై సమగ్రమైన దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు నవీన్ కుమార్ రెడ్డి.