Saturday, May 24, 2025
HomeDEVOTIONALఘ‌నంగా కోదండ‌రాముడి చ‌క్ర‌స్నానం

ఘ‌నంగా కోదండ‌రాముడి చ‌క్ర‌స్నానం

ముగిసిన వార్షిక‌ బ్రహ్మోత్సవాలు

తిరుపతి – తిరుపతి లోని శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం కపిలతీర్థంలోని పుష్కరిణిలో చక్రస్నానం నేత్ర పర్వంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్య స్నానాలు ఆచరించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయ మండపంలో స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు.

ముందుగా ఉదయం 7.30 గంటలకు శ్రీ లక్ష్మణ సమేత సీతారాముల వారు పల్లకిలో కపిల తీర్థానికి వేంచేశారు. ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయ మండపంలో స్నపనతి రుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో సీతారామ లక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్లు పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకాలు అందుకుని ప్రసన్నులయ్యారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.

ఆ తరువాత అక్కడినుండి స్వామి వారు శ్రీ గోవింద రాజస్వామి ఉన్నత పాఠశాలలోని పి.ఆర్‌ తోటకు వేంచేశారు. సాయంత్రం అక్కడి నుండి బయలుదేరి తీర్థకట్ట వీధి, కోటకొమ్మల వీధి, కొత్తవీధి మీదుగా శ్రీ కోదండ రామాలయానికి చేరుకుంటారు. మధ్యలో శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం, శ్రీవైఖానసాచార్యుల ఆలయంలో ఆస్థానం నిర్వహించనున్నారు.

రాత్రి 8.౩౦ నుండి 9.30 గంటల వరకు ధ్వజావరోహణ ఉత్సవంతో శ్రీ కోదండ రామ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో రవి, సూపరింటెండెంట్‌ మునిసంకర్, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments