దావోస్ సదస్సులో ఏపీ సీఎం బిజీ బిజీ
దావోస్ – ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన కొనసాగుతోంది. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా మూడోరోజు వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం అయ్యారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ తో చంద్రబాబు చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులపై సుదీర్ఘంగా సంభాషించారు. యునీలీవర్, డీపీ వరల్డ్ గ్రూపు, పెట్రోలియం నేషనల్ బెర్హాద్ (పెట్రోనాస్), గూగుల్ క్లౌడ్, పెప్సీకో, ఆస్ట్రాజెనెకా సంస్థల సీఈఓలతోనూ బాబు సమావేశమయ్యారు.
దావోస్ సమావేశాల్లో గ్రీన్కోతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. ప్రకృతి వ్యవసాయం, హ్యూమన్ మిషన్ కొలాబ్రేషన్, గ్రీన్ హైడ్రోజన్- పునరుత్పాదక విద్యుత్ వంటి అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలకు ముఖ్యమంత్రి హాజరయ్యారు.
ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించే ప్రయత్నం చేశారు నారా చంద్రబాబు నాయుడు. నష్ట పోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయటం తప్ప, తనకు ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవన్నారు. గత ఐదేళ్లలో, రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం జరిగిందన్నారు.
ప్రజలు నా మీద నమ్మకంతో, ఎన్డీఏ మీద నమ్మకంతో పునర్నిర్మాణం చేయమని మమ్మల్ని గెలిపించారని అన్నారు. రాష్ట్రాన్ని రీ బిల్డ్ చేసి, అభివృద్ధి పథంలో నడిపించి, స్వర్ణాంధ్ర ప్రదేశ్ 2047 విజన్ ని సాధించటమే నా లక్ష్యమని ప్రకటించారు.