నారా చంద్రబాబు నాయుడు ఆవేదన
అమరావతి – శ్రీవారి మహా ప్రసాదాన్ని గత పాలకులు అపవిత్రం చేశారని ఆవేదన చెందారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు . ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ఐదేళ్ల పాటు రాజకీయ పునరావాస కేంద్రంగా టీటీడీని మార్చారంటూ మండిపడ్డారు.
భక్తుల మనోభావాలకు వాళ్లు విలువ ఇవ్వలేదంటూ ఆరోపించారు. ఆచారాలను మంటగలిపారని మండిపడ్డారు. తిరుమల లడ్డూ విషయంలో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు సీఎం. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఐజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఆగమ సలహాదారుల సూచన మేరకు తిరుమలలో శాంతి హోమం చేపట్టారని అన్నారు. ఏ మత ప్రార్థనాలయాల్లో ఆ మతం వారికే మేనేజ్మెంట్ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.
వారు చేసిన అపచారానికి అందరం క్షోభ అనుభవిస్తున్నామని అన్నారు. శ్రీవారి సన్నిధిలో ప్రక్షాళన తీసుకొచ్చి మళ్లీ పూర్వవైభం తీసుకొస్తామని ప్రకటించారు సీఎం. ‘కోట్లాది మంది హిందూ భక్తులంతా పవిత్రంగా భావించే మహా పుణ్యక్షేత్రం తిరుమల. ఏడు కొండల వారిని ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పిలచుకుంటారు. భక్తులందరికీ ఒక నమ్మకం, ఇష్టమైన కలియుగ దేవుడు వెంకటేశ్వరస్వామి. తిరుమలకు వచ్చి కలియుగ దైవం ఆశీర్వాదం తీసుకుంటే బాధలు పోతాయని భక్తుల నమ్మకం.
అలాంటి పవిత్రమైన దేవాలయ ప్రతిష్టను గత పాలకులు దెబ్బ తీశారంటూ వాపోయారు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ వైకుంఠ కాంప్లెక్స్-1 కడితే నేను కాంప్లెక్స్-2 కట్టాను. ఎన్టీఆర్ అన్నదానం పెడితే…నేను ప్రాణదానం తీసుకొచ్చాను.
అన్నదానం కార్యక్రమం ద్వారా ఎంత మందికైనా భోజనం పెట్టొచ్చు. దానికి కార్పస్ ఫండ్ కూడా రూ.2 వేల కోట్లు ఉంది. ప్రాణదానంలో కూడా కార్పస్ ఫండ్ పెరుగుతోంది. 2003లో స్విమ్స్ లో ప్రారంభించాం. బ్రహ్మోత్సవాల సమయంలో పట్టువస్త్రాలు సమర్పించడానికి వెళ్తున్న సమయంలో 23 క్లేమోర్ మైన్స్ పెట్టారు…అప్పుడు నాకు ప్రాణభిక్ష పెట్టింది వెంకటేశ్వరస్వామి.
నాకు పునర్జన్మను ఇచ్చారు. నేను ఏ పని చేసినా వెంకటేశ్వరున్ని తలచుకుని చేస్తానని అన్నారు. రాజశేఖర్ రెడ్డి 7 కొండలు ఎందుకు 2 కొండలు చాలు అన్నప్పుడు నాడు నేను పోరాడాను. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో గత ఐదేళ్లు అపవిత్ర కార్యక్రమాలు, రాజకీయ నాయకులకు పునరావాసం కల్పించారని ఆరోపించారు. భక్తుల మనోభావాలకు విలువ ఇవ్వలేదు. ప్రసాదంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదు. జరిగిన తప్పులపై గత ఐదేళ్లలో ఎన్నోసార్లు భక్తులు ఆందోళన చేసినా పట్టించుకోలేదు.’ అని అన్నారు.
‘నేను కూడా సీఎంగా కాదు..భక్తుడిగా చెప్తున్నా…వెంకటేశ్వరస్వామి ప్రసాదానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. 300 ఏళ్లుగా ఈ లడ్డు తయారు చేసే విధానం, అందులో వాడే పోషకాలు ఎంతో క్వాలిటీగా ఉంటాయి. నాణ్యత లేని సరుకులు ఎక్కడా వినియోగించరు. దేవుడికి సరుకులు సరఫరా చేసే వాళ్లు సైతం ఇచ్చే వాటిని పవిత్రంగా భావించి ఇస్తారు.
ఇంట్లోకి లడ్డు తెచ్చి పెడితే ఇళ్లంతా సువాసన ఉంటుంది. వడ, పొంగలి ప్రసాదాలు దేనికదే ప్రత్యేకత ఉంటుంది. శ్రీవారి లడ్డూకు చాలా డిమాండ్ ఉంటుంది. 40 గ్రాముల ఆవు నెయ్యి, 40 గ్రాముల శనగపిండి, ఇతర దినుసులు 70 గ్రాములు వాడి లడ్డును తయారు చేస్తారు.
2009లో పేటెంట్ రైట్ దక్కింది. అలాంటి ప్రత్యేకత ఉన్న లడ్డూను గత పాలకులు అధికారంలోకి రాగానే ఇష్టానుసారంగా చేశారని ఆరోపించారు. ట్రస్ట్ బోర్డు నియామకాల్లో గ్యాంబ్లింగ్ చేశారు. చట్టాన్ని మార్చి 50 మంది నామినేటెడ్ పోస్టులు అని తీసుకొచ్చారు.
ఎక్స్ అఫిషియో అనే విధానాన్ని తెచ్చి పెట్టారు. టీటీడీ టికెట్లు ఇష్టానుసారంగా అమ్ముకున్నారు. నమ్మకం లేని వాళ్లను బోర్డు ఛైర్మన్లుగా పెట్టి అన్య మతస్తులకు ప్రాధాన్యం ఇచ్చారు. రాజకీయ ప్రయోజనాలకు టీటీడీని ఉపయోగించారు.’ అని చంద్రబాబు మండిపడ్డారు.
‘టెండర్లన్నీ రద్దు చేసి రివర్స్ టెండర్లని పెట్టి నిబంధనలు మార్చారు. నెయ్యి సరఫరా చేయాలంటే మూడేళ్ల పాటు డెయిరీకి అనుభవం ఉండాలి…దాన్ని యేడాదికి తగ్గించారు. నాలుగు లక్షల లీటర్లు ఉత్పత్తి చేసే డెయిరీకి అప్పగించాల్సి ఉన్న నిబంధనను మార్చి ఎవరైనా సరఫరా చేయొచ్చు అనే విధంగా మార్చారు.
‘నేను ప్రక్షాళన చేయాలని చెప్పాను…దీంతో ఇవన్నీ బయటకు వచ్చాయి. ఇవి చూశాక ప్రజలు, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. రిపోర్టులు బయటకు రాకుండా చూశారు. చేసిన తప్పునకు క్షమాపణ చెప్పకుండా మళ్లీ ఎదురుదాడి ప్రారంభించారు. చరిత్రలో ఎప్పుడూ క్షమించరాని నేరం ఇది. భక్తుల మనోభావాల పట్ల గౌరవం ఉంటే ఎదురుదాడి చేస్తారా?. మీరు ఎదురు దాడి చేస్తే మంచి వాళ్లు అని సర్టిఫికేట్ ఇవ్వాలా.?
వెంకటేశ్వరస్వామికి అపచారం చేసి, రిపోర్టు తారుమారు చేస్తే సహకరించాలా.? నిన్నటి నుండి ఒక్కొక్కరి స్టేట్ మెంట్ చూస్తే గుండె రగిలి పోతుంది. మీకు నమ్మకం లేకపోతే దూరంగా ఉండండి. సీఎంగా ఉన్నంత వరకు మత సామరస్యం కాపాడటం నా బాధ్యత. నేను నచ్చిన దేవుడికి పూజ చేసుకోవడం నా కర్తవ్యం. వేరే మతాలను ద్వేషించడం నేను ఎప్పుడూ చేయలేదు. ఉమ్మడి రాష్ట్రంలో చర్చిలపై దాడులు జరిగితే మెదక్, తాడేపల్లిగూడెం వెళ్లి పరిశీలించి చర్యలు తీసుకున్నాను.’ అని గుర్తు చేశారు.
‘గత పాలకుల హయాంలో జరిగిన అపచారాలకు ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త యజ్ఞం ప్రారంభించారు. అన్యాయం జరిగింది అంటే మళ్లీ వెకిలి చేస్తున్నారు. వాళ్ల ప్రవర్తన చూస్తే మనిషి పుట్టుకు పుట్టారా అని అనిపిస్తోంది.
రాజకీయ ముసుగులో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ఇన్ని తప్పులు చేసి మళ్లీ సిగ్గు లేకుండా ప్రధానికి లేఖ రాశారు. హిందువులంతా కుతకుత లాడుతుంటే అసత్యాలతో లేఖ రాసి ఎదురు దాడి చేస్తున్నారు.
కేంద్ర మంత్రి రికమెండేషన్, ఇతర రాష్ట్రాలతో ముఖ్యమంత్రుల రికమెండేషన్ తో టీటీడీ బోర్డు మెంబర్లు నియమించామని రాశారు…బోర్డు మెంబర్లు ఏం చేయగలుగుతారు.? మీ హయాంలో టీటీడీ ఈఓ ఎవరు..ఎక్కడి నుండి వచ్చారు?
ఇంట్లో ఎవరైనా చనిపోతో యేడాది దాకా తిరుమల వెళ్లరు…వెళ్తే అపచారం. ధర్మారెడ్డి కొడుకు చనిపోయిన 12వ రోజే వచ్చారు. సోనియా గాంధీ, అబ్దుల్ కలాం తిరుపతి వచ్చినప్పుడు నమ్మకంతో వచ్చామని చెప్పారు..
ఆయన కంటే జగన్ గొప్పోడా? ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదు.? టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భార్య బైబుల్ పట్టుకుని మాట్లాడతారు. భూమన కరుణాకర్ రెడ్డి కూతరు పెళ్లి క్రిస్టియన్ సంప్రదాయంలో చేశారు…మళ్లీ ఎదురుదాడి చేస్తారు.
నేను కూడా జెరూసలెం వెళ్లాను…అక్కడి సాంప్రదాయాలు పాటించాను. కేరళ గురువాయర్ కు చొక్కా లేకుండా వెళ్లాలి…అది సాంప్రదాయం. ఒక్కో గుడికి ఒక్కో సాంప్రదాయం ఉంటుంది. ఒక్క టీటీడీ ఛైర్మన్ 3 లక్షల 75 వేల దర్శన లెటర్లు ఇచ్చారు…ఇవన్నీ చూసి షాక్ అయ్యా.
విధ్వంసానికి నాంది పలికి మళ్లీ మాది చిన్న పాత్రే పాటించామని చెప్తున్నారు. అడల్ట్రేషన్ టెస్టింగ్ చేయాలంటే ఎన్ఏబీఎల్ అక్రిడేషన్ ఉన్న ల్యాబ్ కు వెళ్లాలి. కానీ గత ఐదేళ్లు అలాంటి టెస్టులు లేవు. టెండర్ కండీషన్ ప్రకారం కల్తీ ఉందా లేదా అనేది పరీక్ష చేయాలి..ఆ పరీక్షలకు అవసరమైన ల్యాంబ్ కు కనీసం రూ.70 లక్షలు ఖర్చు చేయలేక పోయారు. ఇంత అపచారం చేసి కూడా పశ్చాత్తాప పడటం లేదు.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.