పట్టు వస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు
తిరుపతి – ఒంటిమిట్టలో శ్రీ కోదండ రామ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఈనెల 11న కళ్యాణోత్సవం జరగనుంది. సాయంత్రం 6 గంటలకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం తరపున స్వామి, అమ్మ వార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె. శ్యామల రావు ఒంటిమిట్టను సందర్శించారు. ఏర్పాట్లను పరిశీలించారు.
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలకు కడప జిల్లా యంత్రాంగం, టిటిడి సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టిటిడి ఈవో జె. శ్యామలరావు వెల్లడించారు.
ఒంటిమిట్ట ఆలయ ప్రాంగణంలోని పరిపాలన భవనం సమావేశ మందిరంలో ఈవో, కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, టిటిడి జేఈవో వి వీరబ్రహ్మం తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ, శ్రీ సీతారాముల కళ్యాణానికి టిటిడి చేపట్టిన ఏర్పాట్లను వివరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. సీఎం పర్యటన సందర్బంగా విస్తృతంగా ఏర్పాట్లు చేశామన్నారు. కల్యాణ వేదిక ప్రాంగణం వద్ద ఉన్న గ్యాలరీలలో భక్తులు సౌకర్యవంతంగా కూర్చుని వీక్షించేందుకు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి గ్యాలరీలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారామెడికల్, టిటిడి ఉద్యోగులు, పోలీసు, శ్రీవారి సేవకులు ఉండేలా చర్యలు చేపట్టామన్నారు.
కల్యాణ వేదిక ప్రవేశ ప్రారంభంలో తలంబ్రాలు పంపిణీ కోసం తొలిసారిగా ప్రత్యేకంగా 28 క్యూయేస్క్ లు (కౌంటర్లు) ఏర్పాటు చేశామని చెప్పారు. కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యాల తలంబ్రాలు, శ్రీవారి లడ్డూ ప్రసాదం, కంకణం, అన్నప్రసాదాలు అందించేలా పటిష్ట ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఆలయ ప్రాంగణంలో నడిచే భక్తులకు ఎండ వేడి ఉపసమనం కొరకు ఆలయ నాలుగు మాడ వీధులలో వైట్ పెయింట్ వేశామన్నారు. ఆలయ సమీపంలో 3 వేల మంది భక్తులు వేచి ఉండేందుకు, క్యూ లైన్లలో వెళ్ళెందుకు జర్మన్ షెడ్డు ఏర్పాటు చేశామన్నారు.