టీటీడీ ఏర్పాట్లపై సంతృప్తి
తిరుపతి – ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సీతారామ కళ్యాణోత్సవం నభూతో నభవిష్యత్ అన్న రీతిలో జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరయ్యారు సీఎం చంద్రబాబు. తన సతీమణితో కలిసి ప్రభుత్వం తరపున స్వామి, అమ్మ వార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్బంగా టీటీడీ నిర్వహించిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. హాజరైన భక్త బాంధవులకు ధన్యవాదాలు తెలిపారు. చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె. శ్యామల రావును అభినందించారు.
ఇదిలా ఉండగా ఒంటిమిట్ట శ్రీ సీతా రాముల కల్యాణంలో దాదాపు 70 వేల మంది భక్తులు పాల్గొని వీక్షించారు. టీటీడీలోని అన్ని విభాగాలు, జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకొని ఎలాంటి అసౌకర్యం కలుగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. కల్యాణ వేదిక ప్రాంగణం వద్ద విశాలవంతమైన 147 గ్యాలరీలు ఏర్పాటు చేయడంతో భక్తులు సౌకర్యవంతంగా కూర్చుని వీక్షించారు. కళ్యాణోత్సవానికి విచ్చేసిన ప్రతి భక్తుడికి ముత్యాల తలంబ్రాలు, శ్రీవారి లడ్డూ ప్రసాదం, కంకణాలు టీటీడీ అందించింది.
అదేవిధంగా ప్రతి భక్తుడికి లెమన్ రైస్, చక్కర పొంగలి, బిస్కెట్ ప్యాకెట్, మ్యాంగో జ్యూస్, వాటర్ బాటిల్, కారాసు కిట్ రూపంలో అందించారు. శ్రీవారి సేవకులతో గ్యాలరీలలోని భక్తులకు నిరంతరం మజ్జిగ ప్యాకెట్లు, తాగునీరు పంపిణీ చేశారు. నడిచి వచ్చే భక్తుల సౌకర్యార్థం 11 ప్రాంతాలలో, ఆలయ సమీపంలో 3 వేల మంది భక్తులు వేచి ఉండేందుకు ప్రత్యేకంగా షెడ్లు, పానకం, మజ్జిగ, చలివేంద్రం, వాటర్ కూలర్లు, సిబ్బంది ఏర్పాటు చేశారు.శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు 23 ఎల్ ఈడీ స్క్రీన్ లు అందుబాటులో ఉంచామన్నారు ఈవో . భక్తుల సౌకర్యార్థం ట్రాఫిక్ డైవర్షన్ ప్రాంతాల నుండి కల్యాణ వేదిక వరకు టీటీడీ 20 ఉచిత బస్సులు ఏర్పాటు చేశామన్నారు.
13 వైద్య శిబిరాలు, 250 మంది పారామెడికల్ సిబ్బంది, 35 మంది వైద్య నిపుణులు, 8 అంబులెన్స్ లతో వేలాది మందిని పరిక్షించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. 250 మరుగుదొడ్లు, 3,268 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహించారు. 2500 మంది శ్రీవారి సేవకులు, ప్రభుత్వ, పోలీస్, టీటీడీ సిబ్బంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందించారు. శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని ఎస్వీబీసీ హెచ్డి క్యాలిటీతో అందించిన ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రపంచ వ్యాప్తంగా లక్షలాధి మంది భక్తులు వీక్షించారు. తరువాత భక్తులకు లడ్డూలు, కంకణాలు, అక్షింతలు కిట్లతో పాటు అన్నప్రసాదం అందజేశారు.
ఏపీ దేవాదాయ శాఖ మంత్రి రాంనారాయణ రెడ్డి, ప్రోటోకాల్ విఐపిల గెలాక్సీ, టిటిడి బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు, ఇఓ శ్యామలరావు, టిటిడి ట్రస్ట్ బోర్డు సభ్యులు, అదనపు ఇఓ సిహెచ్ వెంకయ్య చౌదరి, జెఇఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ ఇంచార్జ్ హర్షవర్ధన్ రాజు కూడా పాల్గొన్నారు.