ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి
అమరావతి – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. తాను జూన్ 12 తరువాత ఎప్పుడైనా రాష్ట్రంలో ఆకస్మిక తనిఖీలు మొదలు పెడతానని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, వివిధ ప్రభుత్వ సేవలపై సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. ప్రతివారం నాలుగు శాఖల పరిధిలో పథకాలు, సేవలపై ప్రజలనుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ను సమీక్షిస్తున్న సీఎం… రేషన్, దీపం, ఎపిఎస్ఆర్టీసీ, పంచాయతీ సేవలపై వెల్లడైన ప్రజాభిప్రాయాలను పరిశీలించారు. ఈ శాఖల పరిధిలో అమలు అవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల నుంచి ఐవిఆర్ఎస్, క్యూ ఆర్ కోడ్ వంటి విధానాల ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.
ఈ అభిప్రాయాలపై సిఎస్, సిఎంవో సెక్రటరీలతో ముఖ్యమంత్రి చర్చించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావొస్తుందని, అన్ని శాఖల్లో ప్రభుత్వ పనితీరు, ప్రజా సేవల విషయంలో పూర్తి స్థాయి సంతృప్తి కనిపించాలని సిఎం అన్నారు. కొన్ని శాఖల్లో మార్పు వచ్చిందని… అయితే ఆర్టీసీ వంటి చోట్ల ఇంకా సేవల్లో నాణ్యత పెరగాల్సి ఉందని సిఎం అన్నారు. దీపం 2 పథకం ద్వారా లబ్దిదారులకు ఏడాదికి ఇచ్చే 3 సిలిండర్ల సబ్సిడీ మొత్తాన్ని ఒకేసారి ముందుగానే లబ్దిదారుల ఖాతాలో జమ చేస్తామని సిఎం అన్నారు.
లబ్దిదారులు తమకు కావాల్సినప్పుడు దీపం పథకం కింద సిలిండర్ పొందవచ్చు… అయితే వారికి మూడు సిలిండర్లకు ఇచ్చే మొత్తాన్ని ప్రభుత్వం ముందుగానే చెల్లిస్తుంది. దీపం పథకం లబ్దిదారుల నుంచి ఏజెన్సీ వాళ్లు కానీ, ఇతర స్థాయిల్లో గాని ఎక్కడా డబ్బులు అదనంగా వసూలు చేసే పరిస్థితి ఉండకూడదన్నారు.