ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాబోయే రెండేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 105 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి తక్షణమే స్థలాల సేకరణ చేపట్టాలని ఆదేశించారు. నిర్దేశిత గడువు లోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతిపాదిత స్థలాలు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు అనువుగా ఉన్నాయో లేదో పరిశీలించాలన్నారు. స్థలాల కేటాయింపుల్లో పూర్తయిన వాటికి పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు.
సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి విద్యా శాఖపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా కీలక సూచనలు చేశారు. తమ సర్కార్ విద్యా రంగంపై ఫోకస్ పెట్టిందన్నారు. కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేసి వీలైనంత త్వరగా స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి స్థలాల గుర్తింపు ప్రక్రియకు సంబంధించి వారం రోజుల్లో రిపోర్ట్ అందించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే స్థల సేకరణ జరిగిన నియోజకవర్గాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలు పెట్టాలన్నారు. అన్ని రకాల మౌలిక వసతులతో వంద శాతం పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వ విద్యాలయంలో ఆ స్థాయి ప్రమాణాలతో సరైన మౌలిక వసతులు కల్పించాలన్నారు. ప్లే గ్రౌండ్, అకాడమిక్ బ్లాక్, ఇతర సౌకర్యాలను భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు రేవంత్ రెడ్డి. యూనివర్సిటీ అభివృద్ధికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు.