స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – రాష్ట్రంలో ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా రుతుపవనాలు 15 రోజులు ముందుగా వచ్చాయని, దానికి అనుగుణంగా సన్నద్ధమై ముందస్తు ప్రణాళికతో పని చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. వానలు ముందుగా రావడం వల్ల కొన్ని చోట్ల ధాన్యం సేకరణకు ఇబ్బందులు తలెత్తాయని, రైతులు ఆందోళన చెందారని ముఖ్యమంత్రి అన్నారు. మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం భరోసా ఇచ్చారు.
యాసంగి లో గతంలో ఎన్నడూ లేనంత ధాన్యాన్ని ప్రభుత్వం ఈసారి కొనుగోలు చేసిందన్నారు. గత ఏడాది 42 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొంటే, ఈసారి ఇప్పటికే 64.50 లక్షల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యధికంగా ధాన్యం కొనుగోలు జరిగిందని, ఇప్పటికే 90 శాతం ధాన్యం సేకరణ పూర్తయిందన్నారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 48 గంటల్లో రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించామని, ఈ సీజన్లో ఇప్పటికే రూ.12184 కోట్లు చెల్లించామన్నారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో ఈ ఏడాది 2.75 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి సాధించటం, మన రైతులు సాధించిన విజయమని ముఖ్యమంత్రి అన్నారు. ఇందులో భాగస్వామ్యం పంచుకున్న వ్యవసాయ శాఖ, సివిల్ సప్లయిస్ విభాగాలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.