ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి డిమాండ్
హైదరాబాద్ – దివంగత, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కు భారత రత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రానికి మన్మోహన్ సింగ్ ఆత్మ బంధువు అని అన్నారు. తెలంగాణతో ఆయనకు ఎనలేని బంధం ఉందన్నారు. నాలుగున్నర కోట్ల ప్రజానీకం తమ గుండెల్లో పెట్టుకుందన్నారు. సింగ్ మరణం దేశానికి తీరని లోటు అన్నారు.
సోమవారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపాన్ని తెలుపుతూ అసెంబ్లీలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మేధావిగా, రచయితగా, రాజకీయ నాయకుడిగా, ఆర్థికవేత్తగా గుర్తింపు పొందారు సింగ్ అని ప్రశంసలు కురిపించారు.
ఇదిలా ఉండగా మన్మోహన్ సింగ్ తన కెరీర్ లో ఎన్నో ఉన్నతమైన పదవులు నిర్వహించారు. ప్రపంచంలో అత్యున్నతమైన ఆర్థికవేత్తలలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఉన్నారు. 1982-1985 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశారు. రాజ్య సభ సభ్యుడిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా తన పాత్ర నిర్వహించారు డాక్టర్ మన్మోహన్ సింగ్.
ఆయన దేశానికి అందించిన విశిష్ట సేవలకు గాను 1987లో పద్మ విభూషణ్ పురస్కారం పొందారు. అంతే కాదు 1993లొ ఉత్తమ ఆర్థిక మంత్రిగా అవార్డు అందుకున్నారు. 2017 మన్మోహన్ సింగ్ కు ఇందిరా గాంధి దక్కింది. 13వ భారత ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ సింగ్ కు యావత్ భారత జాతి మొత్తం వినమ్రంగా నివాళులు అర్పిస్తోంది.