ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటన
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్టేట్ గా ఎదిగేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. గత సర్కార్ అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తే తాము వచ్చాక అన్నింటినీ చక్కదిద్దే పనిలో ఉన్నామని అన్నారు. జూన్ 2న సోమవారం అధికారికంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. అదానీ, అంబానీలతో పోటీ పడేలా మహిళలను తీర్చి దిద్దుతున్నామని అన్నారు.
స్వయం సహాయక సంఘాలతో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయించామన్నారు. పెట్రోల్ బంకులు, పాఠశాలల నిర్వహణ, యూనిఫాంల కుట్టుపనితో పాటు మహిళా శక్తి క్యాంటీన్లను నిర్వహించేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. తాము తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు అంతర్జాతీయ మార్కెట్ లో మహిళా సంఘాలు పోటీ పడేలా హైటెక్ సిటీ పక్కన శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను ఏర్పాటు చేశామని చెప్పారు రేవంత్ రెడ్డి.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాదు, ఆ బస్సులకు వారిని యజమానులుగా మార్చే కార్యక్రమాలను చేపట్టామన్నారు. మహిళా సంఘాల ద్వారా 600 బస్సలు కొనుగోలు చేయించి.. ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే ఆలోచన చేశామన్నారు. ఇప్పటికే 150 బస్సులను వారికి అందజేసి రాష్ట్ర ఆర్థిక నిర్మాణంలో మహిళలను భాగస్వాములను చేస్తున్నామని స్పష్టం చేశారు సీఎం. మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు అందిస్తున్నామని ప్రకటించారు.
రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు క్యూ ఆర్ కోడ్ తో కూడిన ప్రత్యేక కార్డులు అందజేయాలని నిర్ణయించామన్నారు. వారికి ప్రతీ సంవత్సరం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్ వివరాలతో పాటు పూర్తి వివరాలను ఆ కార్డులో పొందుపరుస్తామన్నారు.
రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశామన్నారు. కేవలం ఎనిమిది నెలల్లో 25 లక్షల, 35 వేల,964 మంది రైతులకు రూ.20,617 కోట్లు రుణమాఫీ చేసి అన్నదాతల రుణం తీర్చుకున్నామని చెప్పారు రేవంత్ రెడ్డి. రూ.15,333 కోట్లతో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.12 వేలకు పెంచామన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంతో భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి ఏడాదికి రూ.12 వేలు ఇస్తున్నామన్నారు. .
భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా భూ భారతి-2025 చట్టాన్ని తీసుకువచ్చామన్నారు. భూ హక్కుల రికార్డులు పక్కాగా నిర్వహించి, భూ యజమానులకు భరోసా కల్పిస్త్నున్నామని తెలిపారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని చెప్పారు.
16 నెలల్లోనే 60 వేలకు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి, నియామక పత్రాలను అందించామని తెలిపారు. డీఎస్సీ ప్రకటించి 10 వేల మందికి పైగా ఉపాధ్యాయులను నియమించామని వెల్లడించారు. అంతర్జాతీయ పెట్టుబడులు రావడంతో ప్రైవేట్ రంగంలో లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు.