సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విజయవంతంగా పూర్తి చేసిన సమగ్ర కుల గణన పై సమీక్ష నిర్వహించారు. జాతీయ స్థాయిలో ప్రభుత్వం చేపట్టిన సర్వే పై ప్రశంసలు అందుతున్నాయని చెప్పారు.
సర్వే విజయవంతంగా చేపట్టిన అధికారులను ఈ సందర్భంగా అభినందించారు.
సర్వే కు సంబంధించిన ముసాయిదా సిద్దమయిందని, పూర్తి నివేదికను ఫిబ్రవరి 2 వ తేదీ లోగా కేబినెట్ సబ్ కమిటీ కి అందజేస్తామన్నారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సర్వే ఆధారంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్దిదారులను ఎంపిక చేయడం మరింత సులభతరం అవుతుందన్నారు.
దీని వల్ల ఏ కులానికి సంబంధించిన వారు ఎంత మంది ఉన్నారనేది కూడా పూర్తిగా క్లారిటీ వస్తుందని చెప్పారు. దీని వల్ల జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ లో నిధులు కేటాయించేందుకు వీలవుతుందన్నారు. తమ ప్రభుత్వం కొలువు తీరి 14 నెలల కాలం పూర్తయిందని , ఈ సందర్బంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు సీఎం.